అంకాలమ్మ తిరుణాలలో పాల్గొన్న యల్లటూరు

పయనించే సూర్యుడు-07-06-2026-రాజంపేట న్యూస్ : మండల పరిధిలోని ఊటుకూరు గ్రామంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించే శ్రీశ్రీశ్రీ అంకాలమ్మ దేవత తిరుణాల మహోత్సవం ఈ ఏడాది కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. శనివారం వైభవంగా నిర్వహించిన ఈ తిరునాళ్లలో జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయ కర్త యల్లటూరు శ్రీనివాస రాజు పాల్గొన్నారు. పెడకాల సుధాకర్ రాయల్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, యువత, జనసేన నాయకులు పాత బస్టాండ్ నుండి ఊటుకూరు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి క్రేన్ సాయంతో గజమాల వేసి శ్రీనివాసరాజుకు ఘన స్వాగతం పలికారు. మేళ-తాళాలు, బాణసంచా కాలుస్తూ పూల వర్షం మధ్య ఆయనకు అపూర్వ ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం శ్రీ అంకాలమ్మ తల్లిని దర్శించుకున్న శ్రీనివాసరాజు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో జీవించాలని ప్రార్థించారు. గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం, యువత పురోగతి కోసం అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయాలు, సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించే ఇటువంటి మహోత్సవాలు సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యల్లటూరు శివరామరాజు, జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.