ఆదోని పాత ఓవర్ బ్రిడ్జికి మరమ్మత్తులు చేయించాలి.

–సిపిఐ సిపిఎం సిపిఐ ఎమ్ ఎల్ న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్ డిమాండ్

పయనించే సూర్యుడు జూన్16 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఆదోని పట్టణంలోని పాత ఓవర్ బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ప్రజలకు ప్రాణాపాయంగా మారిందని సిపిఐ పట్టణ కార్యదర్శి టీ.వీరేష్ సిపిఎం పట్టణ కార్యదర్శి డి లక్ష్మన్న కాంగ్రెస్ పార్టీ ఆదోని ఇన్చార్జి దిలీప్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఎంకప్ప ఆందోళన వ్యక్తం చేశారు. గత శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా రైల్వే లైన్ పక్కన ఉన్న ఫుట్‌పాత్ గోడ దాదాపు 60 అడుగుల మేర కూలిపోయి, కింద నిర్వహిస్తున్న దుకాణాలపై పడిందన్నారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. ఇదే ఘటన రద్దీ సమయంలో జరిగి ఉంటే ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. పాత ఓవర్ బ్రిడ్జి శిథిలావస్థపై గతంలో అనేకసార్లు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బ్రిడ్జి పరిస్థితి రోజురోజుకూ మరింత ప్రమాదకరంగా మారుతున్నందున ప్రజల భద్రత దృష్ట్యా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ఆదోని సబ్ కలెక్టర్‌ను కలిసి పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం సమర్పించారు. పాత ఓవర్ బ్రిడ్జి సైడ్ వాల్ తొలగించి మరమ్మత్తు పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. అధికారులు వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు . రమేష్ అంజిత్ గౌడ్ కొత్తూరు ఈరన్న మహిళా సమాఖ్య నాయకురాలు మణిమ్మ సిపిఎం నాయకులు తిప్పన గోపాల్ శ్రీను తదితరులు పాల్గొని హెచ్చరించారు.