పయనించే సూర్యుడు జులై 08 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు: హిమామ్ నగర్ గ్రామపంచాయతీ గ్రామ మహిళలకు ఉపయోగపడాల్సిన, స్త్రీ శక్తి భవనాన్ని గ్రామానికి దూరంగా అడవి ప్రాంతంలో నిర్మిస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏన్కూరు మండలం హిమామ్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం స్త్రీ శక్తి భవనాన్ని మంజూరు చేసింది. అయితే ఆ భవనాన్ని గ్రామ మధ్యలో నిర్మించకుండా, గ్రామానికి దూరంగా ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని అడవి ప్రాంతంలో నిర్మాణం చేపట్టడంతో గ్రామంలో చర్చ నడుస్తోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు మాట్లాడుతూ, "స్త్రీ శక్తి భవనం అంటే మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామ ప్రజ లు సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి ఉపయోగపడేది. దాన్ని ఊరికి దూరంగా, జన సంచారం లేని ప్రాంతంలో కడితే ఎవరు వస్తారు? మహిళలకు రాత్రి వేళల్లో వెళ్లడం కూడా కష్టం. దీనివల్ల ఎటువంటి లాభం ఉండదు" అని మండిపడ్డారు. భవనం గ్రామానికి అందుబాటులో లేని ప్రాంతంలో ఉండటం వల్ల భవిష్యత్తులో దాని వినియోగం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే నిలిపివేయాలి ఇప్పటికైనా అధికారులు స్పందించి, అడవి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని, స్త్రీ శక్తి భవనాన్ని గ్రామ మధ్యలో, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రదేశంలో నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని వారు కోరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామ మహిళలు, యువకులు విజ్ఞప్తి చేస్తున్నారు.