ఎంపీపీ గొల్లపల్లి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం

పయనించే సూర్యుడు న్యూస్, మే 31 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : మండల పరిషత్ కార్యాలయంలోఎంపీపీ గొల్లపల్లి బుజ్జి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. గత సమావేశాల్లో లేవనెత్తిన స్థానిక సమస్యలపై ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి అధికారులను వివరాలు కోరుతూ, పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల అభివృద్ధిలో అధికారులు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయ పరికరాలు సమయానికి అందేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మండల పరిధిలో వివిధ శాఖల్లో బదిలీపై వెళ్లుతున్న ఉద్యోగులకు ఈ సమావేశంలో ఘనంగా వీడ్కోలు పలికారు. అలాగే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులకు ప్రజాప్రతినిధులు కలిసి ఆత్మీయ స్వాగతం అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామరాజు వర్మ, వైస్ ఎంపీపీలు చిక్కాల రాజలక్ష్మి లక్ష్మణరావు, సాదే లోవరాజు, ఎంపీటీసీలు పసల సూరిబాబు, కొప్పుల బాబ్జి, బుద్ధ సత్యవతి, కాలారి గిరీష , లింగంపర్తి, ఏలేశ్వరం సొసైటీ అధ్యక్షులు పెంటకోట మోహన్, సూతి బూరయ్యతో పాటు పలువురు మండల శాఖల అధికారులు పాల్గొన్నారు.