ఘనంగా రామోజీరావు వర్ధంతి వేడుకలు

పయనించే సూర్యుడు-09-06-2026-రాజంపేట న్యూస్ : రామోజీ గ్రూపు సంస్థల అధినేత డాక్టర్ చెరుకూరి రామోజీరావు ద్వితీయ వర్ధంతి వేడుకలను ఆర్ అండ్ బి బంగళాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈనాడు గ్రూపు సంస్థలు, దినపత్రికలలో గతంలో పనిచేసిన, ప్రస్తుతం పని చేస్తున్న పాత్రికేయులు, ఉద్యోగులందరూ హాజరై రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అనంతరం పాత్రికేయ రంగానికి రామోజీరావు చేసిన సేవలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ పాత్రికేయులు, నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు బాలికల జూనియర్ కళాశాల ప్రధానోపాధ్యాయులు గంగనపల్లి వెంకటరమణ, మలిశెట్టి సుబ్బనరసింహులు, గుండ్రాతి విజయకుమార్, కోలా శివయ్య, కోలా నరసింహులు, ఈటీవీ నాగేంద్ర, వీరాచారి, ప్రభాకర్ నాయుడు, ఈశ్వర్ రెడ్డి, చల్లా సుధాకర్, కొత్తపల్లి గణేష్, ఏడివీటి నగేష్ కుమార్, కూరాకు శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే పాత్రికేయ రంగంలో విలువలకు ప్రాధాన్యతనిచ్చి, వేలాది మందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాలను కల్పించిన రామోజీరావు పత్రికారంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న పాత్రికేయులు, ఉద్యోగులందరినీ గత రెండేళ్లుగా ఒకచోట చేర్చి రామోజీరావుకు నివాళులర్పించడంలో ప్రధాన పాత్ర పోషించిన పూర్వపు ఈనాడు పాత్రికేయులు కొత్తపల్లి గణేష్ బాబును అందరూ అభినందించారు.