పయనించే సూర్యుడు జులై 7 తొర్రూర్ మండలం మహబూబాబాద్ జిల్లా రిపోర్టర్ శ్రీధర్. తొర్రూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో కనీస మౌలిక వసతుల లేమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల రూపాయలు పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ రోడ్లు, డ్రైనేజీ వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ 13వ వార్డులోని కాసం షాపింగ్ మాల్ వెనుక ఉన్న గల్లిలో స్వల్పంగా చినుకు పడినా రోడ్లు పూర్తిగా బురదమయంగా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో కాలినడకన వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాలనీవాసులు అలువాల వెంకటయ్య, మార్గం ఉపేందర్, ప్రసాద్ ఆరోపించారు. వెంటనే ఆ ప్రాంతంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.