చెన్నారావు సేవా కార్యక్రమానికి తిరుమలకుంటలో అపూర్వ స్పందన

★ 30 దైవాల ఘన ఊరేగింపుతో భక్తి పారవశ్యం ★ దైవాలకు నీళ్లు అరబోసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించిన భక్తులు

పయనించే సూర్యుడు న్యూస్ మే 24 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామ పంచాయతీలో కొనా రోశయ్య, కొనాకళ్ల నాగయ్య, పామర్తి వెంకటరమణ, గొల్లపల్లి వెంకన్నబాబు గ్రామ ప్రజల సహకారంతో చెన్నారావు సేవా కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. కార్యక్రమం విజయవంతం కావడానికి గ్రామ యువత, మహిళలు, పెద్దలు సమిష్టిగా కృషి చేశారు. చెన్నారావు సేవా కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొనగా, చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 30 దైవాల ఊరేగింపు గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. డప్పుల మోగింపులు, భక్తి గీతాలు, హారతుల నడుమ దైవాలను గ్రామ వీధుల గుండా ఊరేగించారు. దైవాలను ఊరేగిస్తూ వస్తుండగా భక్తులు ఎవరికి వారు దైవాలపై నీళ్లు అరబోసి, దన్నం పెట్టుకుని, కొబ్బరికాయలు కొట్టి నమస్కారం చేసుకుంటూ భక్తి భావాన్ని చాటుకున్నారు. గ్రామంలోని ప్రతి వీధిలో భక్తి పారవశ్యం కనిపించింది. సాయంత్రం వరకు కొనసాగిన ఈ ఊరేగింపులో మహిళలు, యువకులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నైట్ వాలీబాల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై 30 దైవాలను ప్రతిష్ఠించి సుమారు రెండు గంటలపాటు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై సేవలను తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మండల బీఆర్ఎస్ కీలక నాయకులు కాసాని చంద్రమోహన్, డా. భూక్యా ప్రసాద్ రావు సేవా కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. గ్రామ సంప్రదాయాలను యువత ముందుకు తీసుకెళ్తుండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తమ వంతు సహాయంగా చెరో రూ.5,000 ఆర్థిక సాయం అందజేసి సేవా కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు. అలాగే బిర్రం వెంకటేశ్వరరావు బియ్యం విరాళంగా అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. గ్రామ ప్రజల ఐక్యత, భక్తి భావం, సేవా తత్వం ఈ కార్యక్రమ విజయానికి కారణమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బొల్లుకొండ చెన్నారావు, సున్నం రామలక్ష్మయ్య, జుజ్జురి సత్యనారాయణ, పానుగంటి లక్ష్మణరావు, మాడి ముత్యాలరావు, మోడియం జగనద్దాం, కొనకళ్ల శ్రీనివాస్, మడకం ముత్యాలరావు, సిరిబోత్తుల సాంబయ్య, కొనకళ్ల రామలింగయ్య, పానుగంటి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో విజయవంతం చేశారు.