చౌడేపల్లిలో ఘనంగా డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల ర్యాలీ

పయ ని0చే సూర్యుడు మేజర్ న్యూస్05.07.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల పరిశుభ్రతతోనే ఈ వ్యాధిని అరికట్టవచ్చని చౌడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ మోనా పేర్కొన్నారు. శనివారం పుంగనూరు సబ్ యూనిట్ పరిధిలో గల చౌడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డాక్టర్ మోనా ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ మరియు ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ, జూలై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు జరుగుతాయని తెలిపారు. డెంగ్యూ అనేది 'ఏడిస్' రకం దోమలు కుట్టడం వల్ల వచ్చే ప్రమాదకరమైన వైరల్ జ్వరమని, దీనివల్ల తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోవడం జరుగుతుందని హెచ్చరించారు. దోమ కుట్టిన 4 నుండి 10 రోజులలో 104-105 డిగ్రీల వరకు ఆకస్మిక అధిక జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, కళ్ళ వెనుక నొప్పి, కీళ్ళు-కండరాలలో భరించలేని నొప్పులు (ఎముకలు విరిగినట్లు అనిపించడం), వాంతులు, వికారం, శరీరంపై ఎర్రటి దద్దుర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏడిస్ దోమలు మురికి నీటిలో కాకుండా, కేవలం స్వచ్ఛమైన నిల్వ ఉన్న నీటిలోనే పెరుగుతాయి. ఇండ్లల్లోని కూలర్లు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, పూల కుండీలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నిద్రపోయేటప్పుడు తప్పనిసరిగా దోమల తెరలు వాడాలి. ఒంటిని పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలి. దోమలు కుట్టకుండా ఉండే క్రీములు, లోషన్లు ఉపయోగించాలి. జ్వరం వచ్చిన వెంటనే సొంత వైద్యం (ఆర్ఎంపిలను ఆశ్రయించడం) చేయకుండా, వెంటనే ప్రభుత్వ వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలి. డెంగ్యూ సమయంలో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరి నీరు, మంచినీరు పుష్కలంగా తాగాలి. బొప్పాయి ఆకు రసం, కివీ పండ్లు, దానిమ్మ వంటివి తీసుకోవడం ద్వారా ప్లేట్‌లెట్ల సంఖ్యను వేగంగా పెంచుకోవచ్చని సూచించారు. ఈ సదస్సులో డెంగ్యూతో పాటు మలేరియా, చికున్‌గున్యా, మెదడువాపు, బోధకాలు వంటి ఇతర సీజనల్ వ్యాధుల నివారణపై కూడా ప్రజలకు ఆరోగ్య విద్యను బోధించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు సబ్ యూనిట్ అధికారి జి. గంగయ్య, పి.హెచ్.ఎన్ గంగులమ్మ, సూపర్వైజర్ సుమతి, ల్యాబ్ టెక్నీషియన్ హేమంత్, ఫార్మసిస్ట్ జయమ్మ, ఏఎన్‌ఎంలు, ఎమ్‌ఎల్‌హెచ్‌పీలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.