జడ్చర్ల మున్సిపాలిటీలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల ఇంటర్వ్యూలు

★ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న సుంకసారి యాదమ్మ ఆకస్మిక మృతి పట్ల గిరీష్ తీవ్ర దిగ్భ్రాంతి ★ రేపటి నుండి ఇక్కడ డ్రైనేజీ నిర్మాణ పనులు ముమ్మరంగా ప్రారంభం _మున్సిపల్ కమిషనర్ గిరీష్

పయనించే సూర్యుడు మే 28, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ రుణాల ఎంపిక కోసం బుధవారం మున్సిపల్ కమిషనర్ గిరీష్ అధ్యక్షతనలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. వివిధ బ్యాంకు అధికారుల సమక్షంలో జరిగిన ఈ ఇంటర్వ్యూలలో మొత్తం 20 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరిగిందని తెలిపారు.తదనంతరం జడ్చర్ల మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న సుంకసారి యాదమ్మ ఆకస్మిక మృతి పట్ల మున్సిపల్ కమిషనర్ గిరీష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయంగా రూ.10,000 నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు.తదనంతరం జడ్చర్ల పట్టణంలోని గౌడ ఫంక్షన్ హాల్ ముందు నిర్మిస్తున్న స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపటి నుండి ఇక్కడ డ్రైనేజీ నిర్మాణ పనులు ముమ్మరంగా ప్రారంభం కానున్నందున, వాహనాల రాకపోకలకు వీల్లేకుండా రహదారిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. పట్టణ ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని, మున్సిపల్ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో 5 బ్యాంకుల అధికారులు, ఎస్సీ కార్పొరేషన్ మేనేజర్ లక్ష్మన్న, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.