జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్నివెంటనే పునరుద్ధరించాలి

★ -ఇప్పటికే 300మంది సహచరులను కోల్పోయాం ★ టీ యు డబ్ల్యూ జె రాష్ట్ర అధ్యక్షులు కె. ★విరాహత్ అలీ

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ జూన్ 4గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే, జర్నలిస్టులకు ఆరోగ్య పథకాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ కోరారు. బుధవారం రోజు నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని వినాయక కన్వెన్షన్ లో జరిగిన యూనియన్ నల్లగొండ జిల్లా తృతీయ మహాసభకు ఆయన గౌరవ అతిథిగా హాజరై ప్రసంగించారు. గత ప్రభుత్వం ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఆరోగ్య పథకాన్ని మూడేళ్ల పాటు అమలు చేసిందని, దురదృష్టవశాత్తు 2018 తర్వాత ఆ పథకం సేవలు నిలిచి పోవడంతో, ఎనిమిదేళ్ల కాలంలో, రోడ్డు ప్రమాదాలు, వివిధ వ్యాధులతో దాదాపు 300జర్నలిస్టులు అకాల మరణం చెందినట్లు విరాహత్ అలీ ఆందోళన వ్యక్తం చేసారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన జర్నలిస్టుల ఆరోగ్య పథకం హామీని అమలు చేయాలని ఆయన గుర్తుచేసారు. రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, స్వేచ్ఛ కోసం తమ యూనియన్ నిరంతరం అవిశ్రాంతంగా కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేసారు. డెబ్భై ఏళ్ళ సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగి ఉన్న తమ సంఘం, నాటి నుండి నేటి వరకు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదని, జర్నలిస్టుల పక్షపాతిగా కొనసాగడం తమ స్వభావమని విరాహత్ అలీ స్పష్టం చేసారు. రాష్ట్రంలో జిల్లా మహాసభల ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుందని, ఇప్పటికే 15వేలకు పైగా జర్నలిస్టులు తమ సంఘంలో సభ్యత్వాలు పొందినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు క్రిష్ణారెడ్డి, నాగాయ్యలతో పాటు జిల్లాలోని నల్లగొండ, నకిరేకల్, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల నుండి దాదాపు 350 మంది జర్నలిస్టులు తరలివచ్చారు.