టీజేఆర్ జేసీ ప్రవేశ పరీక్షల్లో సత్తా చాటిన న్యూ లిటిల్ రోజెస్ హై స్కూల్ విద్యార్థులు

విద్యార్థులను అభినందించిన ఉపాధ్యాయులు

పయనించే సూర్యుడు మే 20 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ పాలెం: మండల కేంద్రంలోని న్యూ లిటిల్ రోజెస్ హై స్కూల్ విద్యార్థులు టీ జే ఆర్ జే సీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబర్చి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంకుతో పాటు 1307వ, 2031వ ర్యాంకులను సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం విద్యార్థులను అభినందిస్తూ, వారి విజయానికి క్రమశిక్షణ, పట్టుదల, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వమే కారణమని పేర్కొన్నారు. “కష్టం సుఖమవుతుంది, కలలు నిజమవుతాయి” అనే నినాదాన్ని నిజం చేస్తూ విద్యార్థులు సాధించిన ఈ విజయం పాఠశాలకు మరింత ప్రతిష్టను తీసుకువచ్చిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం విజేత విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.