పయనించే సూర్యుడు న్యూస్ : జూన్/02:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం:సిద్దిపేట జిల్లా మానకొండూర్ నియోజకవర్గం బెజ్జంకి మండలం కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కిష్టయ్య మాట్లాడుతూ, ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్,పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలను తెలుసుకోవడం, రైతుల కష్టనష్టాలను ప్రత్యక్షంగా పరిశీలించడం కోసం మాత్రమే డా. రసమయి బాలకిషన్, వ్యవసాయ మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారని తెలిపారు. రైతుల పక్షాన నిలబడి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ లబ్ధి లేదని స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, జిల్లా యంత్రాంగం ద్వారా నష్టాలను అంచనా వేసి తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులు పంట పొలాల్లో ఉండాల్సిన సమయంలో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని కాపాడుకునేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్న పరిస్థితి నెలకొనడం బాధాకరమన్నారు. డా. రసమయి బాలకిషన్,పై నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ సహించదని హెచ్చరించారు. పట్టణ అధ్యక్షుడు నరేష్ పటేల్ మాట్లాడుతూ, ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న డా. రసమయి బాలకిషన్,ని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. యువజన నాయకుడు సుదర్శన్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే పర్యటనల సమయంలో పంట కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకోవడంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎందుకు విఫలమవుతున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఉపసర్పంచ్ మండల అధ్యక్షుడు బాల నర్సు మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో పదేళ్లలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో దుర్గ సుదర్శన్, పొట్లపల్లి శివ, బాలబాబు, మహంకాళి బాబు, వెంకటేష్, ఎల రాజేందర్, మాసం బాబు తదితరులు పాల్గొన్నారు.