తిమ్మాజిపేట ఎమ్మార్వో కార్యాలయ రహదారి దుస్థితి వెంటనే పరిష్కరించాలి :

వినతి పత్రం అందజేస్తున్న అసెంబ్లీ అధ్యక్షులు ఎర్రోళ్ల పరుశురాం మండల అధ్యక్షులు శంకర్

పయనించే సూర్యుడు మే 30 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట్ మండల కేంద్రంలోని MRO కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలతో నిండిపోవడంతో పాటు వర్షపు నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే రహదారి ద్వారా ఎంపీడీవో కార్యాలయం, ఎమ్మార్వో కార్యాలయం మరియు జూనియర్ కళాశాలకు ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు రాకపోకలు సాగిస్తుండగా ప్రస్తుతం పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, విద్యార్థులు మరియు రైతులు కార్యాలయాలకు వెళ్లేందుకు చాలా కష్టాలు పడుతున్నారని తెలిపారు. రహదారిలో గుంతలు ఎక్కువగా ఉండటం, వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే సంబంధిత శాఖల ద్వారా రోడ్డులోని గుంతలను పూడ్చడం, సీసీ రోడ్ లేదా మెటల్ రోడ్ నిర్మాణం చేపట్టడం, మురుగు నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం, తాత్కాలికంగా గ్రావెల్ లేదా మట్టి వేయించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నాగర్ కర్నూల్ అసెంబ్లీ అధ్యక్షులు ఎర్రోళ్ల పరశురామ్ మరియు బీఎస్పీ తిమ్మాజిపేట్ మండల అధ్యక్షులు ఆగపు శంకర్ ఎంపీడీవో అధికారిని కోరారు.