పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 9 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ మెదక్ జిల్లా, చేగుంట మండలం, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా చేగుంట మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభకు విచ్చేసిన అదనపు కలెక్టర్ ని చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్, ఇ-వ్యర్థాల వల్ల పర్యావరణానికి జరుగుతున్న ముప్పును వివరిస్తూ, వర్షపు చుక్కలను భూమిలోకి ఇంకించేలా ప్రతి ఇంటా ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని, కొత్త ఇళ్లకు అనుమతులు ఇచ్చేటప్పుడే మొక్కలు నాటాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సభలో సర్పంచ్ స్రవంతి సతీష్ మాట్లాడుతూ, మానవ మనుగడకు పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పిలుపునిస్తూనే, గ్రామంలో పన్నుల వసూళ్లు, ఇతర పనుల కొరకు "బిల్ కలెక్టర్లు" లేరని, ఆ కొరతను త్వరగా తీర్చాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఘన వ్యర్థాల నిర్వహణ 2026 నూతన విధి విధానాలను అనుసరించి గృహ స్థాయిలో తడి (ఆకుపచ్చ), పొడి (నీలం), హానికర (నలుపు), మరియు శానిటరీ (ఎరుపు) అని 4 రకాల బకెట్లలో వ్యర్థాలను ఎలా వేరు చేయాలో పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ గ్రామస్తులకు సమగ్రంగా అవగాహన కల్పించారు. వర్షాకాలం సన్నద్ధత, సురక్షిత తాగునీరు, ఓటర్ల జాబితా సవరణ, బడిబాట వంటి 9 కీలక అంశాలపై మాట్లాడినారు.ఈ సభలో.. ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, ఎంపీడీవో చిన్నారెడ్డి, ఎంఈఓ నీరజ, ఏవో హరిప్రసాద్, వార్డు పాలకవర్గం సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది,గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చుతామని ఉమ్మడిగా ప్రతిజ్ఞ చేశారు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ భాగంలో గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు