పయనించే సూర్యుడు మే 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కేశంపేట మండల పరిధిలోని పాటి గడ్డకు ప్రగతి వెలుగులు తీసుకువచ్చేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నానని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పాటిగడ్డ గ్రామంలో రూ. 20 లక్షలతో గ్రామపంచాయతీ భవనం, రూ. 10 లక్షలతో మహిళా సమాఖ్య భవనాలు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఈ భవనాలను స్థానిక యువ సర్పంచ్ అఖిల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా గ్రామంలో ఎప్పటినుంచో ప్రజలు కోరుతున్న వంతెన పనులను కూడా త్వరలోనే పూర్తి అవుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పథంలో ముందుకు నడపాలని లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని వెల్లడించారు. తాను కూడా గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు వెల్లడించారు. ఇందులో భాగంగానే పాటిగడ్డ గ్రామంలో మహిళా సమాఖ్య భవనం, గ్రామపంచాయతీ భవనాలు నిర్మించడం జరిగింది అన్నారు. వంతెన పనులు కూడా మొదలయ్యాయని త్వరలోనే పూర్తి చేసి సమస్య నివారిస్తామని స్పష్టం చేశారు. పాటిగడ్డ గ్రామానికి మరిన్ని నిధులు తెచ్చి అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలబెడతానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పాటిగడ్డ యువ సర్పంచ్ అఖిల్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో పెద్ద ఎత్తున గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని భవిష్యత్తులో కూడా గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పథంలో నడిపిస్తానని గ్రామ ప్రజల సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిలకు రూ. 5వేల చొప్పున నగదు ప్రోత్సాహకాలు ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్పంచ్ అఖిల్ రెడ్డి అందజేశారు. గ్రామ సర్పంచ్ అఖిల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి తాండ్ర విశాల, కొత్తపేట జగదీష్, పల్లె ఆనంద్, మండల పార్టీ అధ్యక్షుడు రమేష్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు వీరేష్ తదితరులు పాల్గొన్నారు..