పయనించే సూర్యడు మే 23 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి రైతు తమకున్న వ్యవసాయ భూమిలో తమ కుటుంబ ఆరోగ్య అవసరాల కోసం ఒక అర ఎకరంలో ప్రకృతి వ్యవసాయం చేయాలని సిరి ఫౌండేషన్ వ్వవస్థాపకులు డాక్టర్ మొలుగూరి గోపయ్య తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని సిరిపురం, నారాయణపురం గ్రామాలలో సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వచ్చే ఖరీఫ్ సీజన్ సందర్బంగా ప్రకృతి వ్యవసాయం పై రైతు చైతన్య యాత్ర కార్యక్రమంలో మాట్లాడారు. గత 65 ఏళ్లుగా చేస్తున్న రసాయన వ్యవసాయం తో భూసారం దెబ్బతిన్నదన్నారు. కాబట్టి భూసారం పెరగాలంటే ఇప్పటి నుండే ప్రతి రైతు నేలకు పశువుల పెంట, చెరువు మట్టి తోలుకోవాలన్నారు. తొలకరి వర్షాలు కురవగానే జీలుగ, పిల్లి పెసర, జనుము లాంటి పచ్చి రొట్ట పంటలను సాగుచేసుకోవాలన్నారు. వరి కొయ్యకాలకు కొందరు రైతులు తెలియక నిప్పంటిస్తున్నారన్నారు. దీంతో నేలలో పంటకు, నేలకు మేలు చేసే సూక్ష్మ జీవులు చనిపోతాయాన్నారు. నేల ఆరోగ్యమే పంట అని పంట ఆరోగ్యమే మన ఆరోగ్యమన్నారు. కాబట్టి ప్రతి రైతు సహజ సిద్ద వ్యవసాయం పై మొగ్గు చూపాలన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.