పయనించే సూర్యుడు, మే 28, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. ప్రముఖ మీడియా విశ్లేషకుడు, విశ్రాంత ఆచార్యులు నాగేశ్వర్ పై ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పోలీసు స్టేషన్లలో బనాయించిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, అరెస్టు చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని టిఎస్ యుటిఎఫ్ జనగామ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి చంద్రశేఖర్ రావు , మడూరి వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఆచార్య నాగేశ్వర్ జర్నలిజం అధ్యాపకునిగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు పాఠాలు బోధించడంతో పాటు, సివిల్ సర్వెంట్స్ మొదలు రాజకీయ నాయకుల వరకు వివిధ అంశాలపై శిక్షణనిస్తూ పాలకులు ఎవరైనా నిక్కచ్చిగా, సామాజిక కోణంలో తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. గత, ప్రస్తుత ముఖ్యమంత్రు లతో సహా రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఏదోఒక సందర్భంలో ఆయన సలహాలు తీసుకున్నవారే. ఒక టివి ఛానల్ ఇంటర్వ్యూలో నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు అసభ్యంగానో, వ్యక్తిగత విమర్శలో కావు. ఆయన వ్యాఖ్యలు నచ్చనివారు ప్రజాస్వామ్యయుతంగా ఖండించవచ్చు. తన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమైన వెంటనే వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయినా ఆయనపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని ప్రయత్నించడం విజ్ఞత అనిపించుకోదు. ఈ చర్య మీడియా స్వేచ్ఛపై దాడిగానే భావించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని కేసులను ఎత్తివేసి ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని కోరుతున్నామని పి చంద్రశేఖర రావు ఏం వెంకటేశ్ పత్రిక ప్రకటనలో అన్నారు.