పయనుంచే సూర్యుడు మేజర్ జూన్ 03.05.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ o ప్రతినిధి జె. నాగరాజ// పుంగనూరు, స్థానిక బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మరుగుదోడ్ల వద్ద ప్రహరీ గోడ కూలిపోయి నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని డాక్టర్ పి. అయూబ్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వందలాది మంది విద్యార్థినులు చదువుకునే ఈ ప్రతిష్టాత్మక కళాశాలలో మరుగుదోడ్ల సమీపంలో గోడ లేకపోవడం వల్ల బాలికల రక్షణ, గోప్యత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. గోడ లేని కారణంగా ఆకతాయిల సంచారం పెరిగే ప్రమాదం ఉందని, విద్యార్థినులు తీవ్ర భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై తక్షణమే స్పందించి, అత్యవసర నిధులు కేటాయించి రక్షణ గోడను నిర్మించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా పనులు ప్రారంభించకపోతే, విద్యార్థినుల భద్రత కోసం అయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.