రాజకీయ లబ్ధి కోసమే డీఎస్సీపై విమర్శలు : పోలి శివకుమార్

పయనించే సూర్యుడు-15-06-2026-రాజంపేట న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ నియామకాల ప్రక్రియపై పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని టిఎన్ఎస్ఎఫ్ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్ విమర్శించారు. ఆదివారం స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఉద్యోగ నియామకాల విషయంలో అవగాహన లేకుండా మాట్లాడడం ద్వారా యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుందని తెలియజేశారు. రిజర్వేషన్ల విధానం, స్పోర్ట్స్ కోటా అమలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలపై సరైన అవగాహన లేకుండానే డీఎస్సీలో అవినీతి జరిగిందంటూ ఆరోపించడం జగన్ రెడ్డి బాధ్యతరాహిత్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీఎస్సీ ఎంపిక ప్రక్రియలు రిజర్వేషన్లు, స్పోర్ట్స్ కోటా ధ్రువపత్రాల పరిశీలన తదితర అంశాలను పారదర్శకంగా అమలు చేసినప్పటికీ పులివెందుల ఎమ్మెల్యే రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం తగదని అన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ కూడా సమర్థవంతంగా అమలు చేయలేని జగన్ రెడ్డి వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించిన కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమో ప్రజలే ఆలోచించాలని పోలి తెలియజేశారు. రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతంగా అమలు చేస్తున్న,కూటమి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకొని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి పోలి శివకుమార్ హితువు పలికారు.