పయనించే సూర్యుడు న్యూస్ జూన్/09: నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం అనంతరం గ్రామం లోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మండలంలోని అనంతారం గ్రామంలో నిర్వహించిన గ్రామసభ తీవ్ర గందరగోళానికి దారితీసింది. సర్పంచ్ వొల్లాల రజిత వెంకటేష్, అధ్యక్షతన పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన ఈ సభలో, సమస్యల పరిష్కారం కంటే అధికారుల నిర్లక్ష్యంపైనే చర్చ ఎక్కువగా జరగడంతో గ్రామస్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై వివరణ ఇచ్చేందుకు విద్యుత్ శాఖ ఏఈ సభకు హాజరుకాకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం బాధ్యతాయుతమైన అధికారి అందుబాటులో లేకపోవడంపై గ్రామస్తులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదే సమయంలో, ప్రభుత్వ ప్రతిష్టాత్మక 'ఇందిరమ్మ ఇండ్ల' పథకంపై గ్రామస్తులు ఆశతో ఎంపీడీఓను వివరాలు కోరగా, ఆమె సమాధానం దాటవేయడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. ఈ సభ ఇండ్లకు సంబంధించినది కాదంటూ ఎంపీడీఓ శశికళ తేల్చి చెప్పడంతో, తమకు న్యాయం జరుగుతుందని. ఎన్నో ఆశలతో సభకు వచ్చిన నిరుపేదలు, లబ్ధిదారులు నిరాశతో వెనుదిరిగారు. సభలో చోటుచేసుకున్న ఈ పరిణామాల పట్ల వార్డు సభ్యుడు మల్యాల రాజశేఖర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల బాధ్యతారాహిత్యం వల్లే ప్రభుత్వ లక్ష్యాలు ప్రజలకు చేరడం లేదని విమర్శించారు. సర్పంచ్, ఎంపీడీఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామస్తులు హాజరైన ఈ సభ, ఆశించిన ఫలితాలను ఇవ్వకుండానే ముగిసింది.