పయనించే సూర్యుడు న్యూస్, జూన్ 06 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుండి జె అన్నవరం వరకు రోడ్డు నిర్మాణం కొరకు ఆపిన పనులను వెంటనే మొదలు పెట్టాలని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా నాయకులు, ఆదివాసీ సంఘ గిరిజన నాయకులు కొసిరెడ్డి గణేశ్వరరావు ఆదేశాల మేరకు తూర్పులక్ష్మీపురం బస్టాప్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా,గిరిజన సంఘ నాయకులు మాట్లాడుతూ రమణయ్యపేట నుండి జె.అన్నవరం వరకు రోడ్డు మంజూరైనది వేస్తున్నామంటూ ప్రజలను జనవరి నెల నుండి ఇప్పటికి ఆరు నెలలు అయినప్పటికీ మూడు కిలోమీటర్ల రోడ్డు కూడా పూర్తిగా వెయ్యలేదని,ప్రజలను నమ్మించి రోడ్డు వేస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. బిల్లులు అవ్వలేదు అంటూ కుంటి సాకులు చెప్తున్నారని,15 రోజుల్లోగా రోడ్డు నిర్మాణం పనులు చేపట్టకపోతే రోడ్డుపై వంట,వార్పు కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. గిరిజన ప్రాంతాల నుంచి ప్రజలు వైద్యం కోసం రావడానికి చాలా అవస్థలు పడుతున్నారని, దారిలోనే ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతేకాకుండా జూన్ నెల దాటితే వర్షాలు సంభవిస్తాయని అప్పుడు వర్షాలు వల్ల రోడ్లు వేయలేమని మొండి చేయి చూపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సోమల కుసుల, నాగులపల్లి అర్జునుడు, నానిశెట్టి లోవరాజు, వల్లి కొండలరావు, నాగులపల్లి శంకర్, కందుల క్రాంతి కుమార్, పడాల తాతీలు, బాబురావు,అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.