పయనించే సూర్యుడు జులై 3 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లి తండాలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) మునీరుద్దీన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో ఇంటింటా నిర్వహిస్తున్న ఓటర్ల సర్వేను పరిశీలించి, ఓటర్ల నమోదు, పేర్లు, చిరునామాల మార్పులు, ఇతర వివరాల సవరణ ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మునీరుద్దీన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఇప్పటికే నమోదైన ఓటర్లు తమ వివరాలను ఒకసారి పరిశీలించి అవసరమైతే సవరణలు చేయించుకోవాలని సూచించారు. అలాగే బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికి వెళ్లి అర్హులైన వారిని గుర్తించి నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ప్రజల్లో ఓటరు నమోదు, సవరణలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, బీఎల్వోలు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.