వట్టెం నవోదయలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

విద్యార్థులతో మమేకం.. విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులపై ఆరా

పయనించే సూర్యుడు జులై 7 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా వట్టెం జవహర్ నవోదయ విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, హాస్టల్, భోజనశాల, బయాలజీ ప్రయోగశాల, మౌలిక వసతులను పరిశీలించి విద్యా ప్రమాణాలపై అధికారులతో చర్చించారు. 12వ తరగతి గణిత బోధనను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తూ సూత్రాలను బట్టీ పట్టడం కాకుండా వాటి భావాన్ని అర్థం చేసుకుని నేర్చుకోవాలని సూచించారు. అనంతరం బయాలజీ ల్యాబ్‌లో స్వయంగా పాఠం బోధించి ప్రయోగాత్మకంగా నేర్చుకుంటేనే విజ్ఞానం పెరుగుతుందని వివరించారు. 10వ తరగతి విద్యార్థులతో పాటు జాతీయ మైగ్రేషన్ పథకం కింద వచ్చిన ఇతర రాష్ట్రాల విద్యార్థులతో సమావేశమై వసతి, భోజనం, ఆరోగ్య సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే నేరుగా పోస్టుకార్డు ద్వారా తెలియజేయాలని సూచిస్తూ, గదుల కొరత తదితర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామీణ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని ఐఏఎస్, ఐపీఎస్, వైద్యులు, శాస్త్రవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు