పయనించే సూర్యుడు న్యూస్ జూలై 04 యడ్లపాడు మండల ప్రతినిధి.. : స్థానిక ప్రాంతంలో ద్విచక్ర వాహనాల చోరీల వ్యవహారం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా, యడ్లపాడులోని టెంట్ హౌస్ సుభాని ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. బాధితుడు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే ఇంటి పై అంతస్తులో గత ఐదేళ్లుగా అద్దెకు ఉంటున్న డొక్కా యాదగిరి (45), తన స్కూటీ (నెంబర్ AP 40 BR 8427)ని నిన్న సాయంత్రం యథావిధిగా ఇంటి ఆవరణలో పార్క్ చేశారు. అయితే, మంగళవారం ఉదయం నిద్రలేచి చూసేసరికి వాహనం అక్కడ కనిపించలేదు. వెంటనే బాధితుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరియు తెలిసిన వారి వద్ద ఆరా తీసినా ఎటువంటి సమాచారం లభించలేదు. తన వాహనం దొంగతనానికి గురైందని నిర్ధారించుకున్న యాదగిరి, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి ముందు పార్క్ చేసిన వాహనం అర్ధరాత్రి సమయంలో మాయం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.