వరికొయ్యాలు తగులబెడితే చర్యలు తప్పవు

- రైతులు అప్రమత్తంగా ఉండాలి.. - వరి గడ్డి, మొక్కజొన్న చేను చొప్ప దహనం చేస్తే కేసులు నమోదు చేస్తాం : - నర్మెట సీఐ అబ్బయ్య

పయనించే సూర్యుడు, మే 21, బచ్చన్నపేట మండలం ప్రతినిధి: నీల పవన్. తరిగొప్పుల మండలంలోని అబ్దుల్‌నగారం గ్రామంలో బుధవారం ఓ రైతు తన పొలంలో వరకొయ్యలకు నిప్పంటించడం వల్ల మంటలు పక్కనే ఉన్న రైతుల పొలాలకు వ్యాపించాయి. ఈ ఘటనలో కొందరు రైతులకు చెందిన గడ్డికట్టలు, బోర్ వైర్లు కాలిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు వెంటనే ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా నార్మెట సీఐ అబ్బయ్య మాట్లాడుతూ రైతులు ఎవరూ కూడా పొలాల్లో వరికొయ్యలు, గడ్డి, మొక్కజొన్న చేను తగలబెట్టవద్దని సూచించారు. నిర్లక్ష్యంగా నిప్పంటించడం వల్ల ఇతర రైతుల పంటలు, గడ్డికట్టలు, వ్యవసాయ పరికరాలు దగ్ధమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే వరి కొయ్యలు తగలబెట్టడం వల్ల భూమిలోని సహజ పోషకాలు నశించి భూమి సారవంతత తగ్గిపోతుందని తెలిపారు. భవిష్యత్‌లో పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉండటంతో రైతులు పంట అవశేషాలను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించాలని సూచించారు. బచ్చన్నపేట మండలంలోని నక్కవానిగూడెం ఆలింపురం గ్రామాల్లో కూడా ఇదేవిధంగా వరికోయ్యలు అంటి పెట్టడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగాయని వాటిని పోలీస్ శాఖ మరియు ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చి ఆస్తి నష్టం పెద్దగా జరగకుండా చూశారని సంఘటన స్థలానికి ఎస్ఐ శ్రీకాంత్ పోలీస్ సిబ్బంది చేరుకొని ఈ సంఘటనపై విచారణ చేస్తున్నామని తెలిపారు. తరిగొప్పుల సంఘటన స్థలానికి నర్మెట సీఐ అబ్బయ్య తో పాటు తరిగొప్పుల పోలీసు సిబ్బంది చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.