వైద్య సిబ్బంది గైర్హాజరుతో ప్రభుత్వ ఆసుపత్రిలో అవస్థలు

పాలెం ఆసుపత్రిలో రోగులకు నిరీక్షణ తప్పని పరిస్థితి – చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

పయనించే సూర్యుడు జూన్ 1 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ పాలెం గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం ఉదయం వైద్య సేవల కోసం వచ్చిన ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఉదయం 10:00 గంటల సమయంలో ఆసుపత్రికి చేరుకున్న రోగులు, వారి కుటుంబ సభ్యులు వైద్యులు మరియు ఇతర సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించాల్సి ఉండగా, విధి నిర్వహణ సమయాల్లో సిబ్బంది గైర్హాజరు కావడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా అత్యవసర వైద్య అవసరాలతో వచ్చిన రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారంగా ఉండటంతో, ఆసుపత్రిలో సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఆసుపత్రిలో వైద్య సేవల నిర్వహణపై సంబంధిత ఉన్నతాధికారులు విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.