వైభవోపేతంగా పేట గంగమ్మ తల్లి జాతర

పయనించే సూర్యుడు-06-06-2026-రాజంపేట న్యూస్ : మండల పరిధిలోని ఊటుకూరు గ్రామపంచాయతీలో గల కొండ్లోపల్లి గ్రామంలో బుధ, గురువారాలలో రెండు రోజులు పాటు పేట గంగమ్మ తల్లి జాతర అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. బుధవారం పల్లకీ సేవ, గ్రామోత్సవం, అన్నదానాలతో కార్యక్రమాన్ని నిర్వహించగా.. గురువారం ఉదయం అమ్మవారి నిజరూప దర్శనం, విశేష అన్నదాన కార్యక్రమంతో పాటు సాయంత్రం మహిళలందరూ అమ్మవారికి పొంగుబాళ్ళు సమర్పించి గండు దీపాల నిర్వహణ, అమ్మవారి సాగనంపు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ జాతరలో మండల పరిధిలోని నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తాదులు పాల్గొని మొక్కులు తీర్చుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. జాతర విజయవంతం అవడంలో కృషిచేసిన ఊటుకూరు గ్రామపంచాయతీ ఎంపీటీసీ నాగా చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ గ్రామంలో కుల, మతాలకతీతంగా అన్ని సామాజిక వర్గాల వారు ఐకమత్యంతో జాతర జరుపుకోవడం జరుగుతుందని వివరించారు. ఐకమత్యంలో తమ ఊటుకూరు గ్రామపంచాయతీ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బత్తల కృష్ణయ్య, పల్లపు సుబ్బారాయుడు, జి.నరసింహులు, రామయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.