సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏబీవీపీ నాయకుల ముందస్తు హౌస్ అరెస్ట్

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు: సీఎం రేవంత్‌కు ఏబీవీపీ హెచ్చరిక

పయనించే సూర్యుడు జూలై 05 మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: పాలమూరు జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో సీఎం బహిరంగ సభకు వెళ్తుండగా ఆయన కాన్వాయిని అడ్డుకుంటారనే ముందస్తు భయంతో పోలీసులు శనివారం తెల్లవారుజామునే ఏబీవీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు హన్మగళ్ల బాల్ రాజ్, ప్రశాంత్, పవన్ తదితరులు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెల్లవారుజామునే తమ నివాసాలకు వచ్చి, నిద్ర లేపి మరీ అక్రమంగా గృహ నిర్బంధం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ. 12 వేల కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీఇంబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా విద్యార్థుల పట్ల వారి వైఖరి మారడం లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.