3వ వార్డులో అగ్ని ప్రమాదం.. అప్రమత్తమైన కౌన్సిలర్

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మే 26 మెట్‌పల్లి పట్టణంలోని 3వ వార్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న 3వ వార్డు కౌన్సిలర్ బత్తుల నరేష్, వెంటనే స్పందించి ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. మంటల తీవ్రతను గమనించిన ఆయన, వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. అయితే, అక్కడ ఫైర్ ఇంజన్ అందుబాటులో లేదని తెలియడంతో నరేష్ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ప్రమాదం మరింత విస్తరించకుండా ఉండేందుకు తనవంతు ప్రయత్నంగా వెంటనే వాటర్ ట్యాంకర్లను తెప్పించారు. స్థానికుల సహకారంతో స్వయంగా మంటలను ఆర్పివేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కౌన్సిలర్ నరేష్ చూపిన ఈ చొరవను, అప్రమత్తతను స్థానికులు అభినందించారు. ప్రమాద సమయంలో ప్రజల పక్షాన నిలిచి తక్షణ సహాయం అందించిన కౌన్సిలర్ తీరుపై స్థానికుల్లో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.