పయనించే సూర్యుడు జూన్ 06, (చింతకాని మండలం రిపోర్టర్). చింతకాని మండలంలోని పందిళ్లపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చింతకాని గ్రామపంచాయతీ 10వ వార్డు సభ్యుడు మాతంగి నాగరాజు మృతి చెందారు. ఖమ్మం నుంచి చింతకాని వైపు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో నాగరాజు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, ఆయనతో పాటు బైక్పై ప్రయాణిస్తున్న మహేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన మహేంద్రను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మాతంగి నాగరాజు మృతి వార్త తెలిసిన వెంటనే చింతకాని గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.