పయనించే సూర్యుడు మే 26 రాజేష్ దౌల్తాబాద్ దౌల్తాబాద్ మండల కేంద్రంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందుప్రియల్ కార్యక్రమం ఆధ్వర్యంలో దుబ్బాక ప్రాజెక్టు పరిధిలోని దౌల్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల మహిళలతో మండల స్థాయి పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. మహిళల ఆరోగ్యం, పోషకాహారం, గర్భిణీల సంక్షేమం మరియు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా దౌల్తాబాద్ పీహెచ్సీలో గర్భిణీలు, బాలింతలకు రక్తహీనత పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిస్థితులను వైద్య సిబ్బంది పరిశీలించారు. అలాగే ఏఎన్సీ చెక్అప్స్ నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న వైద్య అధికారులు మాట్లాడుతూ, మహిళల ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యానికి పునాది అని పేర్కొన్నారు. గర్భిణీలు సమయానికి పరీక్షలు చేయించుకోవాలని, రక్తహీనతను నివారించేందుకు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు, మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు, గర్భిణీలు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు మరియు గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యం, సంక్షేమం, పోషకాహారంపై అవగాహన కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ఈ కార్యక్రమం కీలకంగా నిలిచింది. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు గ్రామ ప్రజలు విశేష స్పందన చూపించారు.