పిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి : సీఐ లతీఫ్

పయనించేసూర్యుడు మే 21 రాజేష్ దౌల్తాబాద్) ఈరోజు తొగుట మండలం సిఐ లతీఫ్ తెలిపారు.ఎండాకాలం సెలవుల నేపథ్యంలో చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఐ లతీఫ్ సూచించారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో ఎక్కువ సమయం పిల్లలు ఇంటి వద్దే గడుపుతున్నారని, ఈ సమయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పిల్లలు చెరువులు, గుంటలు, కాలువల వద్దకు వెళ్లినప్పుడు ఈత కొట్టే సందర్భాల్లో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలను ఒంటరిగా నీటి ప్రాంతాలకు వెళ్లనీయకుండా పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. అలాగే మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా యాప్‌ల వినియోగంపై కూడా తల్లిదండ్రులు నిఘా ఉంచాలని అన్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని మోసపోతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, మొబైల్‌లో ఏమి చూస్తున్నారు వంటి విషయాలపై తల్లిదండ్రులు నిరంతరం దృష్టి పెట్టాలని సూచించారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించి, వారిని మంచి మార్గంలో నడిపించాలని సీఐ లతీఫ్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *