ఘనంగా నిర్వహించిన రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం – ప్రభుత్వ ఆసుపత్రిలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

పయనించే సూర్యుడు, మే 22 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం జహీరాబాద్ పట్టణంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం ఆసుపత్రిని సందర్శించిన నాయకులు అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు మరియు ఆహార పదార్థాలను పంపిణీ చేసి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం పేదలకు, రోగుల సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు రాజీవ్ గాంధీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకున్నారు. సేవా కార్యక్రమాల ద్వారా ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్, నియోజకవర్గ అధ్యక్షుడు నాగిరెడ్డి, ప్రేమ్ సూరి, శ్రీకాంత్, విష్ణు, ఖాదర్, మొయిన్, బాబ్లు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *