పయనించే సూర్యుడు-07-07-2026-రాజంపేట న్యూస్ : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని జనసేన పార్టీ పార్లమెంట్ ఇంచార్జి యల్లటూరు శ్రీనివాసరాజు పేర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలపై సోమవారం ఆర్ అండ్ బి బంగ్లా వద్ద శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోసెఫ్ రావణ్, జడ శ్రావణ్ కుమార్ మరియు ప్రకాష్ రాజ్లకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం యల్లటూరు పాత్రికేయులతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలు మరియు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో రకాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు లక్షల మందికి ఉపాధి కల్పించే అనేక రకాల ఫ్యాక్టరీ, కంపెనీలను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ పటంలో నిలిపేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని జగన్ రెడ్డి పేటీఎం కుక్కలు అసభ్య పదజాలంతో దూషించి, ప్రభుత్వాన్ని అస్థిర పరిచి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారన్నారు. జనసేన పార్టీ సమాజంలో సానుకూల రాజకీయ మార్పు తీసుకురావడానికి కృషి చేస్తోందని, ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు సాగుతోందని తెలిపారు. అలాంటి సమయంలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక కొందరు వ్యక్తులు కావాలనే ప్రజల్లో అపోహలు, విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల మద్దతుతో ప్రజా బలమే ఆయుధంగా రాజకీయాల్లో ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ పై అసత్య ఆరోపణలు చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరించే వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సామాజిక శాంతి, సామరస్యానికి భంగం కలిగించే వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సంబంధిత వ్యక్తులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని కోరుతూ రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ నాగార్జున కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు ,కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.