కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో ఘనంగా మండల పూజా మహోత్సవాలు

పయనించే సూర్యడు / జూన్ 12/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు కుషాయిగూడలోని శ్రీ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో మండల పూజా మహోత్సవాలు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భారీ హనుమాన్ విగ్రహ ఆవిష్కరణతో పాటు మూలవిరాట్ శ్రీ కార్యసిద్ధి హనుమాన్ స్వామి, శ్రీ మహా గణపతి స్వామి విగ్రహాల ప్రతిష్ఠకు 41 రోజులు పూర్తైన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హంపి పీఠాధిపతి, పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ జగద్గురువులు విద్యారణ్య భారతి స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివార్లకు ఔషధీయ మహా అభిషేకం, అఖండ హోమం, ఆలయ సంప్రోక్షణ, భారీ హనుమాన్ విగ్రహ సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 159 దేవాలయాల ప్రతిష్ఠ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన బ్రహ్మశ్రీ శివ కార్తిక్ శాస్త్రి మాట్లాడుతూ, దేవాలయాల అభివృద్ధికి ‘ప్రణాళిక, కార్యక్రమం, నియంత్రణ’ అనే మూడు సూత్రాలు అత్యంత ముఖ్యమని అన్నారు. ప్రణాళికతో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, కార్యక్రమాల ద్వారా ధార్మిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని, నియంత్రణ ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటించాలని సూచించారు. ఈ మూడు సూత్రాల సమన్వయంతో దేవాలయం సమాజానికి ఆదర్శంగా నిలిచి, భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అనంతరం జగద్గురువులు భక్తులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు చల్లా ప్రభాకర్, యావపురం రవి, పనగట్ల చక్రపాణి గౌడ్, అనిల్ బాబు, రేగొండ వెంకటేశ్వర్లు, సీతారామ శర్మ, నాలచర్ల జనార్ధన్, దయానంద్, పిట్ల రాజు, చల్లా వెంకటేష్, యాదగిరి, బాల్ నరసింహ, శ్రీశైలం, లక్ష్మణ్, రాములు, సుభాష్, అనిల్, రాకేష్, భరత్, దత్తు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *