పయనించే సూర్యుడు న్యూస్, జూన్ 03 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : మండలం గర్జనపూడిలో ఉపాధి హామీ పనులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకo అమలులో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయంటూ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్,అధికార దుర్వినియోగానికి పాల్పడుతునాడంటూ పలువురు బహిరంగoగానే ఆరోపిస్తున్నారు.పథకం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి శ్రామికులు తెలిపిన వివరాలు ప్రాకారం ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతాలకు నిజంగా శ్రమించి పనిచేసే కూలీలకు బదులుగా, ఫీల్డ్ అసిస్టెంట్ తనకు సంబంధించిన బంధువులు, సన్నిహితులు, అనుచరులను ఆటోల్లో పనుల ప్రదేశాలకు తరలిస్తున్నట్లు ఆరోపించారు. అక్కడ కొద్దిసేపు మాత్రమే ఉండి,హాజరు నమోదు చేయించికుని, పనులు చేసినట్లుగా మస్టర్ రోల్స్లో నమోదు చేసి,అనంతరం వారిని తిరిగి ఇళ్లకు పంపిస్తున్నారని వాపోయారు. ఇక మరోవైపు,మండుటెండల్లో గంటల తరబడి కష్టపడి పనిచేస్తున్న నిజమైన కూలీలు తగిన గుర్తింపు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు పేర్కొంటున్నారు. వాస్తవంగా శ్రమించిన కూలీలకు,కేవలం హాజరు నమోదుతోనే పనులు చేసినట్లుగా చూపబడుతున్న వారికి ఒకే విధంగా వేతనాలు చెల్లించడం అన్యాయమని వారు విమర్శిస్తున్నారు.ఉద్దేశపూర్వకంగా జాబు కార్డుల ను డిలీట్ చేస్తున్నారని,జాబ్ కార్డుల కోసం వచ్చిన కొంతమంది పేదలను వారి కులాల పేర్లతో అవమానకరంగా మాట్లాడటం వంటి ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయని, ఇటువంటి ప్రవర్తన ప్రభుత్వ సేవల స్ఫూర్తికి విరుద్ధమని, దీనిపై కూడా విచారణ జరగాలని వారు కోరుతున్నారు.గ్రామంలో జరుగుతున్న ఈ వ్యవహారంపై సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. మస్టర్ రోల్స్, హాజరు నమోదులు, పనుల ప్రదేశాల్లోని వాస్తవ పరిస్థితులు,కూలీల వివరాలు, జాబ్ కార్డుల జారీ మరియు తొలగింపు ప్రక్రియలను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుతున్నారు.