పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ మే 31 గూడూరు మండల కేంద్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో, తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్న స్థానిక ప్రజలకు శనివారం మధ్యాహ్నం వరుణ దేవుడు చల్లని కబురు అందించాడు.తీవ్రమైన ఎండల నడుమ మధ్యాహ్నం సమయంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. కాసేపటికే ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. ఈ హఠాత్తు పరిణామంతో వాతావరణం తక్షణమే చల్లబడటంతో స్థానిక ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఉక్కపోత నుండి ఊపిరి పీల్చుకున్నారు. వేసవి తాపానికి తాత్కాలికంగా బ్రేక్ పడటంతో జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ అకాల వర్షం సాధారణ ప్రజలకు ఎండల నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, మండల పరిధిలోని పలువురు రైతులను మాత్రం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.ప్రస్తుతం చేతికొచ్చిన పంటలు ఈ వర్షం కారణంగా దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రతను తట్టుకుని పంటను కాపాడుకుందాం అనుకునే లోపే, ఈ అకాల వర్షం ముంచేయడంతో ఎక్కడ నష్టం వాటిల్లుతుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.