పయనించే సూర్యుడు న్యూస్ జులై 8 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస శాసనసభ్యులు గౌతు శిరీష మంగళవారం థమీమ్ అన్సారియా ఎ., ఐ.ఏ.ఎస్., పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ని విద్యా భవన్, ఆత్మకూరు (వి), మంగళగిరి (ఎం), గుంటూరు జిల్లా కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలాస నియోజకవర్గానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై వినతిపత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా పలాస మున్సిపాలిటీ పరిధిలో యువతకు మెరుగైన క్రీడా సౌకర్యాలు కల్పించి క్రీడలను ప్రోత్సహించేందుకు మినీ స్టేడియం నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. మందస మండలం బుడార్సింగి పీఎం జన్మన్ హాస్టల్ ప్రారంభమైన నేపథ్యంలో, ఆ ప్రాంతానికి చెందిన 81 మంది గిరిజన విద్యార్థులు ప్రతిరోజూ సుమారు 8 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని వివరించారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బుడార్సింగి పీఎం జన్మన్ హాస్టల్ ప్రాంగణంలోనే పాఠశాల ఏర్పాటు చేయాలని డైరెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.విద్యార్థుల విద్యా హక్కును పరిరక్షించే దిశగా ఈ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.