రత్నవరంలో చెలరేగిన భారీ మంటలు: అప్రమత్తమైన సర్పంచ్, పాలకవర్గం.. తప్పిన పెద్ద ప్రమాదం!​పయనించే సూర్యడు మే 23 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు

రత్నవరం గ్రామంలో శనివారం ఒక్కసారిగా చెలరేగిన భారీ మంటలు తీవ్ర కలకలం రేపాయి. స్థానిక ఎస్సీ కాలనీకి ఆనుకొని ఉన్న పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు వరి కొయ్యలకు (నర్సిళ్లకు) నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేసవి తీవ్రత, ఈదురుగాలుల కారణంగా మంటలు చూస్తుండగానే క్షణాల వ్యవధిలో భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. మంటలు పక్కనే ఉన్న ఎస్సీ కాలనీ వైపు వేగంగా దూసుకురావడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ​యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగిన ప్రజాప్రతినిధులు ​విషయం తెలుసుకున్న వెంటనే రత్నవరం గ్రామ సర్పంచ్ దాట్ల నాగేశ్వరావు, ఉప సర్పంచ్ కుంచం ఈదమ్మా యాదగిరి, 6వ వార్డు మెంబర్ మిర్యాలా శ్రీను అత్యంత వేగంగా స్పందించారు. ప్రమాద తీవ్రతను గమనించిన సర్పంచ్ నాగేశ్వరావు తక్షణమే గ్రామ పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సమయం వృథా చేయకుండా పంచాయతీ వాటర్ ట్యాంకర్‌ను నీటితో పూర్తిగా నింపించి, సిబ్బందితో కలిసి స్వయంగా ఘటన స్థలానికి చేరుకున్నారు. ​గ్రామస్తులు, మహిళల అపర భగీరథ ప్రయత్నం ​మంటలు నివాస ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బందితో పాటు స్థానిక కాలనీ ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున శ్రమించారు. ట్యాంకర్ నీటితో పాటు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి, ప్రాణాలకు తెగించి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అందరి ఉమ్మడి కృషితో ఎట్టకేలకు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ​సర్పంచ్ దాట్ల నాగేశ్వరావు హెచ్చరిక: “పొలాల్లో వరి కొయ్యలకు నిప్పు పెట్టడం వల్ల పక్కనే ఉన్న నివాస ప్రాంతాలకు, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇలాంటి బాధ్యతారాహిత్య పనులకు పాల్పడే గుర్తు తెలియని వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. కాలనీ ప్రజలు సకాలంలో స్పందించి సహకరించడం వల్లే ఈరోజు పెద్ద ప్రమాదం తప్పింది.” ​సమయస్ఫూర్తితో వ్యవహరించి మంటలను ఆర్పడంలో కీలక పాత్ర పోషించిన సర్పంచ్ దాట్ల నాగేశ్వరావు, ఉప సర్పంచ్ ఈదమ్మా యాదగిరి, వార్డు మెంబర్ మిర్యాలా శ్రీనులను, కాలనీ మహిళలను మరియు పంచాయతీ సిబ్బందిని గ్రామ ప్రజలు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *