పయనించే సూర్యుడు జూన్ 5 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రవణ్ కుమార్ బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలో నెలకొన్న తాగునీరు, మురుగునీటి కాలువలు, రోడ్లు మరియు డ్రైనేజీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వట్టెం గ్రామసభలో గ్రామస్థులు, వివిధ సంఘాల నాయకులు కలిసి గ్రామ సర్పంచ్ పిట్టల జ్యోతికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామంలో చాలా కాలంగా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల మురుగునీరు రోడ్లపైకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తాగునీటి సరఫరాను మెరుగుపరచడంతో పాటు అధ్వాన్నంగా మారిన అంతర్గత రహదారులు, కాలువలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బ కరుణాకర్, ఎస్సీ సంఘం నాయకుడు డాక్టర్ తిరుపతయ్య, రామకృష్ణ, రాజు, తిరుపతయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. వినతిపత్రం స్వీకరించిన సర్పంచ్ పిట్టల జ్యోతి మాట్లాడుతూ గ్రామసభలో ప్రజలు ప్రస్తావించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని, తాగునీరు మరియు డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.