పయనించే సూర్యుడు జూలై 4, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) భారతరత్నతో ఎస్వీ రంగారావును గౌరవించాలి: నాయకుల డిమాండ్ కాకినాడ: పౌరాణిక, సాంఘిక పాత్రలలో తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన విశ్వనట సార్వభౌముడు ఎస్వీ రంగారావు తెలుగు సినీ పరిశ్రమకు అపూర్వమైన సేవలు అందించిన మహానటుడని వైఎస్సార్ పార్టీ నాయకులు, కాకినాడ రూరల్ మండల జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, మాజీ సర్పంచ్ రామదేవు సూర్యప్రకాశరావు (చిన్నా) పేర్కొన్నారు. ఆంధ్ర కాపు సద్వావన సంఘం కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్వీ రంగారావు 108వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్వీ రంగారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ, పౌరాణికం, సాంఘికం, ప్రతినాయకం వంటి విభిన్న పాత్రల్లో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న మహోన్నత నటుడు ఎస్వీ రంగారావు అని కొనియాడారు. సుమారు 300కు పైగా చిత్రాల్లో నటించి, ఏ పాత్రలోనైనా అమోఘమైన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించిన అరుదైన నటుడు ఎస్వీ రంగారావు అని తెలిపారు. అతి నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన, తన కృషి, ప్రతిభతో తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశారని అన్నారు. ముఖ్యంగా ప్రతినాయక పాత్రలకు ఆయన జీవం పోసి, తన ప్రత్యేక నటనతో తెలుగు సినిమా ప్రపంచంలో విశిష్ట స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. తెలుగు చలనచిత్ర రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ, ఎస్వీ రంగారావుకు భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు అనసూయ ప్రభాకర్ రావు, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు రావూరు వెంకటేశ్వరరావు, సిద్దా శివాజీ, మహిళా వైసీపీ కార్యకర్తలు భువనేశ్వరి, లక్ష్మీ, భవాని ఆంధ్ర కాపు సద్వావన సంఘం నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సినీ అభిమానులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని ఎస్వీ రంగారావుకు ఘన నివాళులు అర్పించారు.