పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 3, తల్లాడ రిపోర్టర్ విధి నిర్వహణలో ఎటువంటి మచ్చ లేకుండా అంకితభావంతో, సేవాగుణంతో పనిచేసిన హసీనాబేగం గ్రామ రైతుల మన్నలను పొందారని గ్రామ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, ఉపసర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వర్లు(కెవి), గ్రామ రైతులు కొనియాడారు. అన్నారుగూడెం ఏఈఓగా పనిచేసి బదిలీపై మల్లవరంకు వెళ్ళిన ఆమెను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ రైతు ఆపతి వెంకట రామారావు అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్క రైతును పేరు పెట్టి పిలిచి వారి సమస్యలు పరిష్కరించెంత సన్నిహిత్యం ఏర్పడిందన్నారు. గ్రామంలో సుమారు 8ఏళ్ల పాటు సుదీర్ఘంగా సేవలందించడం అభినందనీయమన్నారు. గ్రామంలో సుదీర్ఘకాలం పనిచేసిన అధికారిగా ఆమె ప్రత్యేక గుర్తింపు సాధించారని, ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మిగతావారు పనిచేయాలని సూచించారు. అనంతరం ఏఈఓ హసీనా మాట్లాడుతూ గ్రామ నాయకులు, రైతులు తనకు ఎంతో సహకరించారని, వారు సహకరించటం వల్లే సుదీర్ఘకాలం పని చేశానని తెలిపారు. ఇప్పటివరకు తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సాయికుమార్, వార్డు మెంబర్లు గడేసుల ఆనందరావు, గొడ్ల సునీత, కోపెల లక్ష్మి, పావురాల శ్రీలత, రైతులు మారెళ్ళ దేవేంద్రరావు, గోవిందు శ్రీనివాసరావు ట్రాక్టర్, తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు, పులి వెంకట నరసయ్య, తాళ్ల అగస్టీన్, కందుల నారాయణ, తదితరులు పాల్గొన్నారు.