పయనించే సూర్యుడు మే 24 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లింగసానిపల్లి గ్రామ శివారులో ఈరోజు సాయంత్రం పిడుగుపాటు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షం సమయంలో పడిన పిడుగుకు 28 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. తిమ్మాజిపేట మండలం చేగుంట గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు మల్లయ్య, చెన్నయ్య తమ గొర్రెల మందను మేపుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షం కురవడంతో పాటు పిడుగు పడటంతో గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి . సంఘటన స్థలానికి లింగసానిపల్లి సర్పంచ్ చంద్రకళ శ్రీరాములు, చేగుంట సర్పంచ్ కె.మల్లయ్య, వసంతపూర్ సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి చేరుకుని బాధితులను పరామర్శించారు. జీవనాధారాన్ని కోల్పోయిన కాపరులను ప్రభుత్వం వెంటనే ఆదుకుని నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.