పయనించే సూర్యుడు జూన్14 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. మంత్రాలయం నియోజకవర్గంలోని మాధవరం గ్రామంలో నిన్న చోటుచేసుకున్న వైసీపీ కవ్వింపు చర్యలు ప్రజాస్వామ్యానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ మాధవరం గ్రామానికి చేరుకుని నియోజకవర్గ ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డి నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర రెడ్డి తో పాటు స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై జరిగిన సంఘటనలపై వివరాలు తెలుసుకున్నారు.కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశాలకు లోనుకాకుండా సంయమనం పాటించాలని, పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమై ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ముందుకు సాగాలని ఆమె సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించే వారిపై ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భద్రతకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను పార్టీ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ స్పష్టం చేశారు. మాధవరం గ్రామంలో నెలకొన్న పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి, పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పి వారికి పూర్తి మద్దతు ప్రకటించారు.