పయనించే సూర్యుడు జులై 5 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఓటర్ నమోదు కార్యక్రమం శనివారం ముమ్మరంగా నిర్వహించారు. గ్రామంలోని బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓలు), బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, వాటిని ఎలా సక్రమంగా పూరించాలో వివరించారు. ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకునే అర్హులైన వారు, అలాగే పేరు, చిరునామా లేదా ఇతర వివరాల్లో మార్పులు, చేర్పులు అవసరమైన వారు ఈ ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓ బత్తుల వెంకటేశ్వర్లు, బీఎల్ఏలు దొంతరమోని పరశురాములు, బి. ఆనంద్ సింగ్, వార్డు సభ్యురాలు చింతల పద్మ, నరసింహ, ఆంజనేయులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.