జూలై 6న ఉచిత రెబీస్ టీకాలు

వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం

పయనించే సూర్యుడు జులై 5 నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా జూలై 6న జిల్లాలో పెంపుడు జంతువులకు ఉచితంగా రెబీస్ టీకాలు వేయనున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ జ్ఞాన శేఖర్ తెలిపారు. ప్రతి సంవత్సరం జూలై 6న నిర్వహించే ఈ దినోత్సవం జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. రెబీస్ ప్రాణాంతక వ్యాధి అయినప్పటికీ, కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించడం ద్వారా పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. ఈ మేరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లాలో ప్రత్యేకంగా ఉచిత రెబీస్ టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పెంపుడు జంతువుల యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. జంతువులు అసాధారణంగా ప్రవర్తించినా లేదా కుక్క, ఇతర జంతువులు కరిచినా వెంటనే గాయాన్ని సబ్బు, నీటితో శుభ్రంగా కడిగి సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అవసరమైన చికిత్స, రెబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ జ్ఞాన శేఖర్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *