పయనించే సూర్యుడు న్యూస్ జూలై 07 యడ్లపాడు మండల ప్రతినిధి.. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎడ్లపాడు గ్రామంలోని 94వ బూత్ పరిధిలో సర్వే కార్యక్రమం కొనసాగుతోంది. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, కొత్త ఓటర్ల నమోదు, పేరు మార్పులు, చిరునామా సవరణలు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తూ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఏజెంట్లు అశోక్, పున్నారావు, సునీల్ చురుకుగా పాల్గొని ఓటర్లకు ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకుని, అవసరమైన సవరణలు ఉంటే సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేదా అవకతవకలు చోటుచేసుకోకుండా ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలిస్తూ, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో సక్రమంగా నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గ్రామ ప్రజల సహకారంతో ఎస్ఐఆర్ సర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా విజయవంతంగా కొనసాగిస్తున్నారు.