పయనించే సూర్యుడు న్యూస్ జూలై 05 యడ్లపాడు మండల ప్రతినిధి కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా యడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామంలో సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఓటర్ల వివరాలను అత్యంత క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి ఇంటి వివరాలను ధృవీకరిస్తూ, ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేదా అవకతవకలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 75, 76 బూత్ల బూత్ లెవెల్ ఏజెంట్లు సయ్యద్ మస్తాన్ వలి, షేక్ సుభాని, షేక్ జానీ చురుకుగా పాల్గొని ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలిస్తూ, అర్హులైన ఓటర్ల వివరాలు మాత్రమే నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన ప్రతి దరఖాస్తును సచివాలయ సిబ్బందితో కలిసి పరిశీలించి ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చర్యలు చేపడుతున్నారు. అలాగే గ్రామ ప్రజలకు ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రాముఖ్యతను వివరించి, ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. పారదర్శకత, నిష్పాక్షికతతో ఓటరు జాబితా రూపొందేలా అన్ని చర్యలు చేపడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.