పయనించే సూర్యుడు జులై 10 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 78వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాలెం గ్రామంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగర్కర్నూల్ జిల్లా ప్రముఖ్ సందు యాదగిరి మాట్లాడుతూ, విద్యార్థుల్లో జాతీయ భావన, క్రమశిక్షణ, సేవా దృక్పథం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో ఏబీవీపీ గత 78 ఏళ్లుగా విశేష సేవలందిస్తోందని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొని దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలెం టౌన్ అధ్యక్షుడు కొంకలి మధుసూదన్, మండల కన్వీనర్ అప్పల జీవన్, పాలెం నగర కార్యదర్శి విష్ణు నాయుడు, పూర్వ నాయకులు జయప్రకాశ్, భానుప్రకాశ్తో పాటు ఏబీవీపీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, గ్రామ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.