ప్రత్యామ్నాయ పంటలతోనే దిగుబడులు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూలై 04.07.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి0 జె. నాగరాజ// అన్నమయ్య జిల్లా బోయకొండ ఆర్‌ఆర్‌ కాలనీ నందు శుక్రవారం ఎస్టీ రైతులతో ప్రత్యేక అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్నమయ్య జిల్లా వ్యవసాయ అధికారి శివన్నారాయణ వారు మాట్లాడుతూ, ఈ ఏడాది ‘ఎల్ నినో’ ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, అలాగే వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. ఇటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించడానికి రైతులు సాంప్రదాయ వరి సాగుకు స్వస్తి చెప్పి, ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు. తక్కువ కాలంలోనే చేతికి వచ్చే, అలాగే బెట్ట (కరుడు) పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకునే జొన్న, సజ్జ, రాగులు వంటి చిరుధాన్యాల పంటలను సాగు చేసుకోవడం ద్వారా నష్టాల నుంచి గట్టెక్కవచ్చని ఆయన సూచించారు. రైతులు ‘ప్రీ-మాన్‌సూన్ డ్రై సోయింగ్’ (తొలకరి ముందే పొడి నేలలో విత్తడం) పద్ధతిని పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి కోరారు. వర్షాలు పడటానికి ఒకటి లేదా రెండు వారాల ముందే పొడి నేలలో విత్తనాలు నాటడం వల్ల, ఆ తర్వాత పడే మొదటి వర్షానికే వేర్లు భూమిలోకి బలంగా పాతుకుపోతాయని, తద్వారా పంటకు బెట్టను తట్టుకునే శక్తి లభిస్తుందని వివరించారు. ఈ సందర్భంగా ఎస్టీ రైతులకు ప్రభుత్వం తరఫున 50 శాతం సబ్సిడీ (రాయితీ) కింద కంది విత్తనాలను పంపిణీ చేశారు. అలాగే, బోర్ బావుల వసతి ఉన్న రైతులు ప్రభుత్వం అందించే రాయితీని సద్వినియోగం చేసుకుని డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం) పరికరాలను అమర్చుకోవాలని, దీనివల్ల తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ అవగాహన సదస్సులో పుంగనూరు వ్యవసాయ సహాయ సంచాలకులు శివకుమార్, వ్యవసాయ అధికారి మోహన్ కుమార్, ఆత్మ బి.టి.ఎం అమృత్ కుమార్, ఏఈఓ శివ శంకర్, వి.ఎ.ఎ.లు శ్రీదేవి, నవీన్ పాల్గొన్నారు. వీరితో పాటు ఎస్.ఆర్.ఆర్.ఐ ఎన్జీఓ ప్రతినిధులు ఎస్. రామాచారి, పి. శ్రీనివాసులు, ఆర్. శరత్, జి. సుబ్బరాజు మరియు పెద్ద సంఖ్యలో యానాది (ఎస్టీ) రైతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *